Updated : 28/06/2021 05:12 IST నీట మునిగి 8 మంది మృతి మరో అయిదుగురి గల్లంతు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విషాద ఘటనలు ఆదివారం ఆ స్నేహితుల పాలిట శాపమైంది. కరోనా ఆంక్షలు చాలావరకు సడలించడం, పైగా సెలవురోజు కావడంతో తమ మిత్రులతో కలిసి సరదాగా స్నానం చేయడానికి నదులు, సముద్రానికి వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో 8 మంది యువకులు నీట మునిగి వేర్వేరు ప్రాంతాల్లో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోగా అయిదుగురు గల్లంతయ్యారు. తమ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. పెనమలూరు, న్యూస్టుడే: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక కృష్ణా నదిలో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. తాడిగడప కార్మికనగర్కు చెందిన పోతర్లంక జైసాయి శ్రీనివాస్ (25), గురునానక్ కాలనీకి చెందిన కరిమెరకల గోవిందు(22), రామవరప్పాడుకు చెందిన కరిమెరకల సతీష్(21), ఆటోనగర్లోని ఏపీఎల్ఐసీ కాలనీకి చెందిన పొలగాని శివలు స్నేహితులు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీరంతా పెదపులిపాక వద్ద కృష్ణా నదిలో స్నానం చేసి ఈత కొట్టడానికి బయల్దేరారు. శివ ఒడ్డునే ఉండిపోగా శ్రీనివాస్, గోవిందు, సతీష్లు నీటిలోకి దిగారు. తొలుత తక్కువ లోతులో ఈతకొడుతున్న వీరికి పెద్ద పెద్ద చేపలు కనిపించడంతో వాటిని పట్టుకోవడానికి నీటిలో పరిగెడుతూ ఒక్కసారిగా 20 అడుగుల ఊబిలోకి జారిపోయారు. సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు అగ్నిమాపక దళ సిబ్బందితో నదిలో గాలించి, సాయంత్రం ఆరు గంటల సమయంలో ముగ్గురి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. కొద్దిరోజుల క్రితం ఇదే ప్రాంతంలో ముగ్గురు బాలురు నదిలో మునిగిపోయి చనిపోవడం గమనార్హం. కొత్తపట్నం సముద్ర తీరంలో ఇద్దరు... కొత్తపట్నం, న్యూస్టుడే: ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో అలల ఉద్ధృతికి ఆదివారం సాయంత్రం ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన శనగపల్లి శ్రీనివాస్(21), ఒంగోలు నగరం గోపాలనగరం మూడో లైన్కు చెందిన ఈర్ల సుజిత్(21) బాల్య స్నేహితులు. సుజిత్ గుంటూరు ఆర్వీఆర్ జేసీ కళాశాలలో, శ్రీనివాస్ కాకినాడ కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నారు. ఆన్లైన్ తరగతులకు ఆదివారం సెలవు కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై కొత్తపట్నం తీరానికి వెళ్లారు. సుజిత్, శ్రీనివాస్ సముద్రంలోకి దిగడంతో అలల ఉద్ధృతికి నీట మునిగి అక్కడకక్కడే మృతి చెందారు. వశిష్ఠ గోదావరిలో నలుగురు విద్యార్థుల గల్లంతు పి.గన్నవరం, న్యూస్టుడే: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం పరిధిలోని వశిష్ఠ గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన లంకలగన్నవరం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం... లంకలగన్నవరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు యర్రంశెట్టి రత్నసాగర్, బండారు నవీన్, పంతాల పవన్, ఖండవిల్లి వినయ్ స్నేహితులు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. రాత్రి 7 గంటల వరకు తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వశిష్ఠ గోదావరి వద్ద గాలించారు. అక్కడి ఇసుక తిన్నెల మీద వారి దుస్తులు, చెప్పులు, రెండు సెల్ఫోన్లు ఉన్నాయి. దాంతో వారంతా స్నానానికి నదిలో దిగి గల్లంతై ఉంటారని భావిస్తున్నారు. తమ పిల్లలు ఏమయ్యారోనని వారి కుటుంబ సభ్యులు ఆందోళనతో కన్నీరుమున్నీరవుతున్నారు. జన్మదిన వేడుకల్లో అపశ్రుతి సోంపేట, కవిటి, న్యూస్టుడే: శ్రీకాకుళం జిల్లా కవిటి బీచ్లో స్నేహితుని జన్మదిన వేడుకల సందర్భంగా సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. కవిటి మండలం బొర్రపుట్టుగకు చెందిన బొర్ర సాయిలోకేష్(20) పుట్టిన రోజు సందర్భంగా 20 మంది స్నేహితులు గ్రామంలోనే వేడుకలు చేసుకుని, భోజనాల తర్వాత బీచ్కి వెళ్లారు. వారిలో అయిదుగురు సముద్రంలో స్నానాలకు దిగారు. పెద్ద అల రావడంతో నలుగురు గల్లంతయ్యారు. మత్స్యకారులు వచ్చి సముద్రంలో గాలించి... సాయి లోకేష్, బొర్ర మనోజ్కుమార్(21), మరిడి తిరుమల(18)ల మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. బొర్ర గోపీచంద్(18) గల్లంతయ్యాడు. Tags :