ప్రధానాంశాలు ‘తెలంగాణ’ నుంచి తొలి కేబినెట్ మంత్రి కిషన్రెడ్డి ఈనాడు, హైదరాబాద్: కేంద్రంలో నరేంద్రమోదీ కేబినెట్లో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 25 నెలల ఏడు రోజుల వ్యవధిలోనే కిషన్రెడ్డి పదోన్నతి పొందారు. తెలంగాణ ఆవిర్భవించాక కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి కేబినెట్ హోదా దక్కించుకున్న తొలి నేతగా గుర్తింపు పొందారు. నరేంద్ర మోదీ తొలి విడత సర్కార్లో బండారు దత్తాత్రేయ స్వతంత్ర హోదాలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నికైన కిషన్రెడ్డి హోంశాఖ సహాయమంత్రి పదవి దక్కించుకుని 2019 మే నెల 30 నుంచి ఆ పదవిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి భాజపా నేతలు సీహెచ్.విద్యాసాగర్రావు, బంగారు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయలు కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రులుగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లో భాజపా నుంచి చూస్తే.. వెంకయ్యనాయుడి తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రిపదవి పొందిన రెండో నేత కిషన్రెడ్డి. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా బుధవారం ఉదయం కిషన్రెడ్డికి ఫోన్చేసి పదోన్నతి గురించి తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి.. గంగాపురం కిషన్రెడ్డి ఎమ్మెల్యేగా మూడుసార్లు విజయం సాధించారు. 2019లో సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురంలో సామాన్య రైతు కుటుంబంలో 1960లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ.. అంచెలంచెలుగా ఎదిగారు. దిల్లీకి వెళ్లిన భాజపా నేతలు కిషన్రెడ్డికి కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి లభించడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. సంజయ్తో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్రెడ్డి, మరికొందరు నేతలు బుధవారం హైదరాబాద్ నుంచి బయల్దేరి దిల్లీకి వెళ్లారు. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో భాజపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కిషన్రెడ్డికి కేబినెట్ మంత్రి పదవి ఇవ్వడం వెనుక ఓసీల్లో బలమైన సామాజికవర్గాన్ని ఆకర్షించే వ్యూహం ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మోదీ వద్ద కిషన్రెడ్డికి మంచి మార్కులు ఎంపీగా గెలిచిన తొలిసారే కేంద్రంలో సహాయమంత్రి పదవి పొందిన కిషన్రెడ్డి కొద్ది కాలంలోనే కేబినెట్ హోదా పొందడానికి ప్రధానంగా ఆయన పనితీరే కారణమని తెలుస్తోంది. శాఖాపరమైన అంశాలపై నిరంతరం దృష్టి పెడుతూ, పట్టుదలగా పనిచేస్తూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాల మెప్పు పొందారు. మంత్రుల పనితీరు సమీక్షలో కిషన్రెడ్డి మంచి మార్కులతో ఐదో స్థానంలో నిలిచారు. కొద్దిరోజుల క్రితం.. ‘కొత్త బాధ్యతలు తీసుకుంటారా’ అని అమిత్షా అడగ్గా.. ‘మీతోనే కలిసి పనిచేస్తా’నని కిషన్రెడ్డి చెప్పినట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా పర్యటించారు. సహాయమంత్రి అయినప్పటికీ శాఖాపరమైన, జమ్మూకశ్మీర్ వంటి కీలక అంశాలపైన పార్లమెంటు ఉభయసభల్లో సమాధానాలు చెప్పారు. Tags :