కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న కొండగట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లాకేంద్రం నుంచి 35 కి.మీ.ల దూరంలో ఉంది. వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కి.మీల దూరంలో ఉంది. ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. రోగగ్రస్థులు, సంతాన హీనులు అంజన్న సన్నిధిలో 41 రోజులు గడిపితే బాగవుతారని భక్తుల విశ్వాసం. క్షేత్రచరిత్ర/స్థలపురాణం: దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. వెతికి వేసారిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయస్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికికి అవధుల్లేకుండాపోయాయి. భక్తిభావంతో కోరంద ముళ్లపొదలను తొలగించి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. నారసింహ వక్త్రంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్యభాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆధారాలున్నాయి. శ్రీరాముడు సీతకోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్కరాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు పురాణగాథను చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారిపక్కన సీతాదేవి రోదించినట్టు చెప్పే కన్నీటిగుంతలు భక్తులకు దర్శనమిస్తాయి. ఆలయంలో నిర్వహించే ప్రధాన పర్వదినాలు.. • ఏటా చైత్ర పౌర్ణమిరోజు హనుమాన్ చిన్నజయంతి, వైశాఖ బహుళదశమినాడు వచ్చే పెద్ద హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి దీక్ష తీసుకున్న లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని ముడుపులు కట్టివెళ్తుంటారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మూడ్రోజులపాటు హోమం నిర్వహిస్తారు. • ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. • చైత్ర శుద్ధనవమి రోజు శ్రీరావమనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది. • శ్రావణమాసంలో సప్తాహ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. • ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నెల రోజులపాటు తిరుప్పావై, గోదారంగనాయకుల కల్యాణం జరుగుతుంది. • వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం గావిస్తారు. • దీపావళి పర్వదినం సందర్భంగా సహస్ర దీపాలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతారు. • ఆలయ పవిత్రతతోపాటు లోక కల్యాణం నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. • ప్రపంచ శాంతి. జగత్కల్యాణ సిద్ధికి ఏటా మూడు రోజులపాటు శ్రీ సుదర్శన మహాయాగం జరుపుతారు. ఆలయంలో నిర్వహించే పూజల సమయాలు ⇒ ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, ⇒ ఉదయం 4.30 నుంచి ఉదయం 5.45 గంటల వరకు శ్రీ స్వామివారి ఆరాధన ⇒ ఉదయం 5.45 నుంచి 6 గంటల వరకు బాలబోగ నివేద మొదటి గంట ⇒ ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు సూర్య దర్శనం ⇒ ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు నిత్యహారతులు ⇒ ఉదయం 9 నుంచి 11.30 వరకు శ్రీస్వామివారి అభిషేకం ⇒ ఉదయం 11.30 నుంచి 12.30 వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం ⇒ మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో గంట ⇒ మధ్యాహ్నం 12.45 వరకు భజన తీర్థప్రసాదం ⇒ మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు విరామం(మంగళ, శనివారాలు మినహా.. ఆలయ మూసివేత) ⇒ మధ్యాహ్నం 3 గంటలకు 4.30 గంటల వరకు సూర్య దర్శనం ⇒ మధ్యాహ్నం 4.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ స్వామి వారి ఆరాధన, మూడో గంట ⇒ సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు నిత్యహారతులు ⇒ రాత్రి 7 గంటల వరకు శ్రీ లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన ⇒ రాత్రి 7.30 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి సేవా ఉత్సవం ⇒ రాత్రి 8.15 గంటలకు భజన ⇒ రాత్రి 8.30 గంటలకు కవట బంధనం ⇒ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు విరామం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. దర్శన టికెట్ల సమాచారం > అంజన్న అభిషేకం... టికెట్ ధర.. రూ.100 > మండపంలో నిర్వహించడానికి రూ. 250 > ప్రత్యేక దర్శనానికి రూ. 20 > సాధారణ ధర్మదర్శనం ఉచితం > ప్రత్యేక దర్శనానికి రూ. 20 > అంతరాలయంలో త్వరిత దర్శనానికి రూ. 120, రూ.200 > గర్భగుడిలో ప్రత్యేక దర్శనానికి ఐదుగురు సభ్యులకు రూ. 316 ప్రత్యేక పూజలు.. టికెట్ల వివరాలు ♦ ఉదయం అంజన్నకు అభిషేకం రూ. 100 ♦ మహామండపంలో రూ. 250 ♦ మహామండపంలో రూ. 250 ♦ అమ్మవారికి కుంకుమపూజ రూ. 50 ♦ సత్యనారాయణ వ్రతానికి రూ. 100 ♦ సాయంత్రం వేంకటేశ్వరస్వామికి ‘సేవా’ టికెట్టు రూ. 150 ♦ ఫోన్ లేదా ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం లేదు. ♦ ఆర్జిత సేవల టికెట్ల వివరాలను ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం లేదు. ♦ ఉపాలయాలు... పూజా కార్యక్రమాలు: ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవారి ఉపాలయాలు ఉన్నాయి. వేంకటేశ్వర స్వామికి సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ♦ అమ్మవారికి కుంకుమార్చన చేయవచ్చు. సాయంత్రం నిత్యహారతులు ఉంటాయి. ప్రధాన ఆలయానికి వెనుక వైపున బేతాళస్వామి, రామాలయాల్లో ఎలాంటి ప్రత్యేకపూజలు ఉండవు. వసతి సౌకర్యాలు ⇔ కొండపై మూడు ప్రత్యేక గెస్ట్హౌస్లు ఉన్నాయి. వీటికి రోజుకు రూ. 250 అద్దె ఉంటుంది. ⇔ మరో 30 గదుల వరకు భక్తులకు రోజువారీగా అద్దెకు ఇవ్వడానికి ధర్మసత్రాల గదులు లభిస్తాయి. వాటిలో కొన్నింటికి రూ. 50 చొప్పున, మరికొన్నింటికి రూ. 150 వరకు అద్దె ఉంటుంది. ⇔ఉచితంగా ఉండటానికి డార్మిటరీ రేకుల షేడ్లు ఉన్నాయి. ⇔ గదుల గురించి వివరాలు తెలుసుకోవడానికి ఏఈవో ఫోన్ నెం. 98487 78154 ⇔ కొండపై హరిత హోటల్ ఉంది. ఎలాంటి కాటేజీలు లేవు. రవాణా సౌకర్యం: హైదరాబాద్కు 160 కి.మీ.ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లేందుకు హైదరాబాద్ ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి.. జగిత్యాలకు వెళ్లే బస్సులు ప్రతి 30 నిమిషాలకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసులను టీఎస్ ఆర్టీసీ నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేటు క్యాబ్లు, ఆటోల సౌకర్యమూ ఉంది. Search ఏ జిల్లా