ప్రధానాంశాలు
సిట్ నివేదికలో పేరున్న వారినుంచి వాటాల డిమాండ్
భయభ్రాంతుల్లో విశాఖ ప్రజలు
మతమార్పిళ్లపై ఎస్సీ కమిషన్కు ఏం చెబుతారు?
సీఎం జగన్కు ఎంపీ రఘురామ లేఖ
ఈనాడు, దిల్లీ: ‘‘విశాఖపట్నం భూ కుంభకోణాలపై సిట్ నివేదికలో ఉన్నవారిని పిలిచి మన పార్టీ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ఇన్ఛార్జి ఆ భూముల్లో వాటాలకు డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేరు చెప్పి కొందరు ‘సిట్లో నీ పేరుంది. నీకున్న పదెకరాల్లో మూడు ఎకరాలు ఉంచుకొని ఏడెకరాలు మాకివ్వు. లేదంటే మేమే ధర కట్టి ఉంచుకుంటాం అంటున్నార’ంటూ అభియోగాలు వస్తున్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే మీకు అసహ్యం. వాటి నుంచి మనం బయటపడాల్సి ఉన్నందున విచారణ చేయించండ’ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి గురువారం లేఖ రాశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘విశాఖపట్నం జిల్లాలో రూ.వేల కోట్ల భూ కుంభకోణంపై గత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేసింది. సిట్ నివేదిక సమర్పించినా.. అంతలోనే ప్రభుత్వం మారిపోయింది. మన ప్రభుత్వం వచ్చాక విశ్రాంత ఐఏఎస్ విజయ్కుమార్ నేతృత్వంలో మరో సిట్ ఏర్పాటుచేశారు. ఈ సిట్ మన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అక్రమాలకు పాల్పడ్డారంటూ గ్రామస్థాయి అధికారుల నుంచి తహసీల్దార్ వరకు పలువురిని పోలీసులు అప్పట్లోనే అరెస్టు చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎందరికో పాత్ర ఉందని మీరు పలుమార్లు ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు అవసరమన్నారు. మన రాజ్యం, జగనన్న ప్రభుత్వం వచ్చాక, రాజధానిగా ప్రకటించాక విశాఖ ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మీరు విశాఖ ప్రజల మనసు దోచుకోవాలి
విశాఖలో ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో రెండు రోజులుగా దాడులు చేస్తున్నట్లు తెలిసింది. ఆ నివేదిక బయటపెట్టాలి. పాత సిట్ నివేదికల్లా ఇదీ ఇంకోరకంగా ఉపయోగపడుతుందా లేదా చర్యలు తీసుకుంటారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఏపీకి నిజమైన, ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుందనడంలో సందేహం లేదు. విశాఖ.. కలల రాజధాని. అదో అందమైన నగరం. దాన్ని పెద్దగా అభివృద్ధి చేయాల్సిన పనిలేదు. ఇప్పుడు విశాఖకు ఉన్న ముప్పు భూకుంభకోణాలు. రాజధానిగా లేకపోతే ప్రపంచస్థాయికి ఎదిగే నగరమది. సెకండ్ షో సినిమా చూసి నిర్భయంగా ఇంటికి వెళ్లొచ్చు. గాంధీ కోరుకున్న స్వాతంత్య్రం విశాఖలో ఉండేది. మీరు విశాఖ వెళ్లలేదు కాబట్టి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ప్రజలు ఎలా భయభ్రాంతులకు గురవుతున్నారనేది తెలుసుకోండి. విశాఖపై ముగ్గురు పిండారుల్లా పడిపోయారని ఓ ఛానెల్లో ప్రసారమైంది. ఆ ముగ్గురు ఎవరనేది సీతారామాంజనేయులు తేల్చితే మంచిది. స్పందించే గుణం లేని వాళ్లు కూడా విజయసాయిరెడ్డికి చెందిన ప్రగతి భారత్ ట్రస్టుకు రూ.వంద కోట్ల విరాళాలు ఇచ్చారని అంటున్నారు. వారెవరు? విరాళాలు ఎలా ఖర్చుపెట్టారో తెలపాలి. విజయసాయిరెడ్డి చాలా అనుభవమున్న ఆడిటర్. పార్లమెంటులో ఆయన ప్రదర్శనలు చూస్తే ఎంతో పరిణితి చెందారని, మహానాయకుడి కోవలోకి వస్తారనడంలో సందేహం లేదు. ఆయనపై వచ్చే ఆరోపణలతో పార్టీకి అప్రతిష్ఠ కలుగుతుంది. వీటన్నింటిపై విచారణ చేయించి విశాఖ ప్రజల హృదయాన్ని ముఖ్యమంత్రి దోచుకోవాలి.
అనర్హులెవరో గమనించాలి
మతం మారిన ఎస్సీలు రిజర్వేషన్లు వాడుకుంటున్నారన్న ఫిర్యాదుపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. రాష్ట్రంలో ఎంతమంది పూజారులు, ఫాస్టర్లు, మౌజీలున్నారో మా జగనన్న ప్రభుత్వం కచ్చితమైన లెక్కలు వేసింది. గత ప్రభుత్వం క్రిస్మస్ కానుకలు ఇచ్చిన సందర్భంగా క్రైస్తవులు ఇచ్చిన స్వీయ ధ్రువీకరణను బట్టి కూడా లెక్కించవచ్చు. 2011 జనాభా లెక్కల్లో 88 శాతం హిందువులు, 2% క్రైస్తవులు, 7% ముస్లింలు, మిగిలింది ఇతరులు అని తేల్చారు. 88%గా ఉన్న హిందువులకు 31,500 మంది పూజారులుంటే, 2% క్రైస్తవులకు 29,500 మంది ఫాస్టర్లు ఉన్నారు. మన ప్రభుత్వం ఏ లెక్కలు తీసుకొని ఎస్సీ కమిషన్కు వివరణ ఇస్తుందో వేచిచూడాలి. మత మార్పిళ్లు, మాతృభాషలో ప్రాథమిక విద్య బోధనపై రాజ్యాంగబద్ధంగా మాట్లాడిన నేను అనర్హుడినా.. నాపై అనర్హత వేటు వేయాలంటున్న మా పార్టీ ఎంపీలు అనర్హులా.. అన్నది ప్రజలు గమనించాలి. రాష్ట్రానికి సంబంధించి సుమారు 800 కోర్టు ధిక్కరణ కేసులున్నాయి. మన కోసం పనిచేసిన అధికారులను కోర్టుల్లో నిలబెట్టడం అన్యాయం. ఉద్యోగులకు రూ.12 వేల కోట్ల బకాయిలపై ముఖ్యమంత్రి స్పందించాలి. నీటి వివాదాలపై కేంద్ర నోటిఫికేషన్ను తొలుత పొగిడి, తర్వాత అభిశంసించడం ముఖ్యమంత్రికి సరికాదు’ అని పేర్కొన్నారు.
Tags :