తానా సాహిత్య సదస్సు విజయవంతం
న్యూయార్క్: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం (జూన్ 27న) అంతర్జాలం వేదికగా ‘ఉభయ తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా వికాసం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సు విజయవంతంగా జరిగింది. తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి స్వాగతోపన్యాసం చేశారు. తెలుగు భాష, సాహిత్య పరిరక్షణ కోసం ఇతర సంస్థలతో, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడానికి తానా ఎల్లప్పుడూ ముందుంటుందని వివరించారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. విద్యాలయాల్లో విద్య ‘లయ’ తప్పుతోందన్నారు. పలు రాష్ట్రాల్లో పాలకుల విద్యా విధానాలు శ్రుతిమించి ‘రోగాన’ పడుతున్నాయన్నారు. చాలా విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయకుండా, విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తున్నారని, ఒకవేళ భర్తీ చేసినా మొక్కుబడిగా వారిని తాత్కాలికంగా నియమిస్తూ అరకొర వేతనాలు ఇస్తూ భోదించే అధ్యాపకులే లేని అధ్వాన పరిస్థితుల్లోకి నెడుతున్నారని పేర్కొన్నారు. జ్ఞాన సంపదను సృష్టించాల్సిన దేవాలయాల లాంటి పవిత్ర విద్యాలయాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటి విశ్వ విద్యాలయాలతో విశ్వానికే తలమానికంగా నిలిచిన మన దేశానికి పూర్వవైభవం అవసరం అన్నారు. అందుకు ప్రభుత్వాలు, ప్రజలు, సంస్థలు సమష్టిగా కృషి చేయాలని ప్రసాద్ తోటకూర చెప్పారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన డాక్టర్ నీలి బెండపూడిని సమావేశానికి పరిచయం చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకుని అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని పురాతనమైన లూయివిల్ విశ్వవిద్యాలయపు అధ్యక్షురాలు (ఉపకులపతి)గా ఎన్నికగావడం ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ విషయమని కొనియాడారు. తాను ఏ దేశంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా.. భారతీయురాలిగా, తెలుగు వ్యక్తిగా తనను గుర్తించడం గర్వకారణమని నీలి బెండపూడి ఈ సందర్భంగా చెప్పారు. తెలుగు భాష మాధుర్యాన్ని, సాహిత్యపు విలువలని, ఎంతోమంది సాహితీవేత్తల కృషిని, అమెరికాలో 40 సంవత్సరాలుగా తానా చేస్తున్న కృషిని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డాక్టర్ తంగెడ కిషన్ రావు మాట్లాడుతూ.. ఈ సమావేశం ద్వారా వివిధ విశ్వవిద్యాలయాల తెలుగు శాఖాధ్యక్షులతో వేదిక పంచుకోవడం ఆనందదాయకంగా ఉందని చెప్పారు. వివిధ సాహితీ సంస్థలు, సాహితీ ప్రియులు, తానా లాంటి సంస్థలతో కలిసి తెలుగు విశ్వవిద్యాలయంలో అనేక జాతీయ, అంతర్జాతీయ తెలుగు సమావేశాలు నిర్వహించాలనే ఆసక్తి ఉందని తెలిపారు. తెలుగు భాష, సాహిత్యం, కళల అభివృద్ధికి తెలుగు విశ్వవిద్యాలయం విశేషంగా కృషి చేసేందుకు కట్టుబడి ఉందని ప్రకటించారు.
మైసూరు విశ్వవిద్యాలయం (మైసూరు) పూర్వ తెలుగు శాఖ సంచాలకులు ఆచార్య డా. ఆర్వీఎస్ సుందరం, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (నెల్లూరు) యోజన నిర్దేశకులు ఆచార్య డా. దిగుమర్తి మునిరత్నం నాయుడు, మద్రాస్ విశ్వవిద్యాలయం (చెన్నై) తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. విస్తాలి శంకర్ రావు, ఆలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఆలిఘర్) తెలుగు శాఖాధ్యక్షులు సహాయ ఆచార్యులు డా. పటాన్ ఖాసిం ఖాన్, మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం (మధురై ) తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. జొన్నలగడ్డ వెంకట రమణ, బెంగళూరు విశ్వవిద్యాలయం (బెంగళూరు) తెలుగు శాఖాధ్యక్షురాలు ఆచార్య డా. కొలకలూరి ఆశాజ్యోతి, దిల్లీ విశ్వవిద్యాలయం (దిల్లీ) తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య డా. గంప వెంకట రామయ్య, కర్ణాటక రాజ్య సార్వత్రిక విశ్వవిద్యాలయం (మైసూరు) తెలుగు శాఖాధిపతి ఆచార్య డా. మొగరాల రామనాథం నాయుడు, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (వారణాసి) తెలుగు శాఖాచార్యులు ఆచార్య డా. బమిడిపాటి విశ్వనాథ్ ఈ సదస్సులో పాల్గొని తమ తమ విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖ ఆవిర్భావం, జరుగుతున్న అభివృద్ధి, తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా రంగాల్లో సాధించిన ప్రగతి గురించి తెలిపారు. భవిష్యత్ కార్యక్రమాలు, ప్రభుత్వాల నుంచి ఇంకా అందాల్సిన సహాయ సహకారాల అవసరాలను వివరించారు.
ఈ సదస్సులో పాల్గొన్న హాస్యావధాని, ప్రముఖ పాత్రికేయుడు హాస్య బ్రహ్మ డా. టి.శంకర నారాయణ తన హాస్య ప్రసంగంలో విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, మునిమాణిక్యం నరసింహారావు, శ్రీశ్రీ, ఆరుద్ర, చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి లాంటి సాహితీవేత్తల జీవితాల్లోని హాస్య సంఘటలను వివరించి సభను నవ్వులతో ముంచెత్తారు. ఏడాదిగా ప్రతి నెలా తానా నిర్వహిస్తున్న సాహితీ సమావేశాలతో పోల్చుకుంటే ఇదొక ప్రత్యేక సాహిత్య సమావేశమని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, విజయవంతం చేయడంలో సహకరించిన ప్రసార మాధ్యమాలకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags :