మండిపడ్డ మహిళా కిసాన్ సంసద్
నిత్యావసర సరకుల (సవరణ), ఎంఎస్పిపై కేంద్రీకరణ
రెండు తీర్మానాల ఆమోదం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలోని రైతులపైన, రైతు ఉద్యమంపైన అపవాదులేస్తున్న కేంద్ర మంత్రులు, బిజెపి నేతలకు సిగ్గుంటే, ఆ రైతులు పండించే పంటలో ఒక్క మెతుకు కూడా ముట్టుకోకూడదని మహిళా కిసాన్ సంసద్ స్పీకర్, మాజీ ఎంపి సుభాషిణీ అలీ అన్నారు. సోమవారం నాడిక్కడ జంతర్ మంతర్ వద్ద జరిగిన మహిళా కిసాన్ సంసద్ (మహిళా రైతుల పార్లమెంట్)కు స్పీకర్గా వ్యవహరించిన ఆమె సభను ప్రారంభిస్తూ, మహిళలు సేద్యం చేయడమే కాదు, దేశాన్ని కూడా ఏలగలరనడానికి నిదర్శనమే ఈ మహిళా పార్లమెంటు అని అన్నారు. ఈ సభకు హాజరైన ప్రతి ఒక్కరూ రాజకీయవేత్తలేనని అన్నారు. ఢిల్లీ, ఆ చుట్టు పక్కల రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి 200 మంది మహిళా రైతులు సింఘూ సరిహద్దుకు చేరుకుని , అక్కడి ఐదు బస్సుల్లో జంతర్ మంతర్కు చేరుకున్నారు. కిసాన్ సంసద్కు సంఘీభావం తెలిపేందుకు బయల్దేేరిన కాంగ్రెస్ నేత అల్క లంబను పోలీసులు అడ్డుకున్నారు. ఐద్వా, సిఎస్డబ్ల్యు, ఎన్ఎఫ్ఐడబ్ల్యు, పిఎంఎస్, ఎస్ఎంఎస్ నేతలను మార్గం మధ్యలోనే అరెస్టు చేసి బరాఖంబా పోలీస్ స్టేషన్కు తరలించారు.
కార్గిల్ వీరులకు నివాళి
మహిళా కిసాన్ సంసద్లో మూడు సెషన్లు జరిగాయి. మొదటి సెషన్కు స్పీకర్గా సుభాషిణి అలీ, డిప్యూటీ స్పీకర్లగా సుమన్ హుడా చౌదరి, రవీంద్ర పాల్ కౌర్ వ్యవహరించారు. రెండో సెషన్కు స్పీకర్గా అన్నీ రాజా, డిప్యూటీ స్పీకర్లుగా జగ్మతి సంగ్వాన్, హరీందర్ కౌర్ బిందు, సురీందర్ జైపాల్, మూడో సెషన్కు స్పీకర్గా మేధా పాట్కర్, డిప్యూటీ స్పీకర్లుగా కమల్జీత్, నిషా సిద్ధు, అనురాధ బెనివాల్ వ్యవహరించారు. తొలుత మహిళా రైతులంతా జాతీయ గీతం ఆలపించారు. కార్గిల్ విజరు దివస్ సందర్భంగా కార్గిల్ అమర వీరులకు నివాళులర్పించారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతులకు శ్రద్ధాంజలి ఘటించారు. రైతు ఉద్యమ సమయంలో తన భర్తను కోల్పోయిన రమేష్ను మహిళా కిసాన్ సంసద్కు సుభాషిణీ అలీ పరిచయం చేశారు. ఆమెకు వ్యక్తిగత నష్టం ఉన్నప్పటికీ, ఆమె పోరాటంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
నిత్యావసర వస్తువుల సవరణ చట్టంపై చర్చ
మహిళా కిసాన్ సంసద్లో నిత్యావసర వస్తువుల సవరణ చట్టంపై చర్చ జరిగింది. ఆహార సరఫరాలో పెద్ద పెద్ద బడా కార్పొరేట్లకు నిల్వ చేసుకునేందుకు, బ్లాక్ మార్కెటింగ్కు చట్టపరమైన అనుమతిని ఈ సవరణ ఇచ్చిందని చర్చలో పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ చట్టం ప్రభావం రైతులపైనే కాదని, దేశంలోని ప్రతి వినియోగదారుడిపైనా ఉందన్నారు. మూడు కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు నినదించారు. రైతుల కనీసమద్దతు ధరను గ్యారంటీ చేస్తూ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల (సవరణ ) చట్టం మహిళలకు ఆహారాన్ని దూరం చేస, వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ఈ చట్టం కారణంగా ఆహార ధర భరించలేనిదిగా మారినప్పుడు, దాని ప్రభావం స్త్రీలపై ఎక్కువగా ఉంటుందని అన్నారు.
మొదటి సెషన్కు స్పీకర్గా వ్యవహరించిన సుభాషిణీ అలీ మాట్లాడుతూ చారిత్రాత్మక రైతు ఉద్యమంలో 540 మంది మరణించారని, వారిలో ఏడుగురు మహిళలుఉన్నారని తెలిపారు. అమరవీరులను గుర్తు చేసుకునేందుకు, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపేందుకు ప్రధాని మోడీకి సమయం లేదని విమర్శించారు. సమిష్టి లక్ష్యం కోసం ఐక్యంగా పోరాడుతున్న మన మధ్య తగాదాలు సృష్టించేందుకు మాత్రం వారికి సమయం ఉందని దెప్పిపొడిచారు.. రైతుల్లో విభజన తెచ్చేందుకు, ఉద్యమాన్ని చీల్చేందుకు మోడీ సర్కార్ చేయని కుట్రంటూ లేదని విమర్శించారు. రైతులంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికతో కూడిన సందేశం పంపారని పేర్కొన్నారు. రైతు ఉద్యమంపై మోడీ సర్కార్, కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తీవ్రవాదం, ఖలిస్తానీ ముద్రలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలు చేసేవారికి ఏమాత్రం సిగ్గున్నా, వీళ్లు ఎవరిపైనైతే ఖలిస్తానీలని ముద్ర వేస్తున్నారో, వారు పండించిన పంటలోని ఒక్క మెతుకు కూడా ముట్టుకోకూడదని హితవు పలికారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన మోడీ, దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేందుకు సిద్ధపడ్డాడని ధ్వజమెత్తారు.
ఏకగ్రీవంగా తీర్మానాల ఆమోదం
మహిళా కిసాన్ సంసద్ రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. మహిళలు వ్యవసాయ రంగంలో ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, వారు దేశంలో రావాల్సిన గౌరవం, గుర్తింపు, హోదాను పొందటం లేదు. వారి శ్రమ, కషి, నైపుణ్యం, పరిజ్ఞానం, వారి శక్తిని సమాజంలోని ప్రజా ఉద్యమాల్లో తీసుకోవాలి. రైతుల ఉద్యమంలో మహిళా రైతుల పాత్ర, అవకాశాలను పెంచడానికి చర్యలు తీసుకోవాలన్న మొదటి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పంచాయతీ, మున్సిపాలిటీ వంటి స్థానిక సంస్థల్లో ఉన్న 33 శాతం మహిళ ప్రాతినిధ్య రిజర్వేషన్లను, పార్లమెంట్, అసెంబ్లీల్లో కూడా కల్పించాలని, జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలనే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. కిసాన్ సంసద్లో యాక్టర్ గుల్ పనాగ్, ఎస్కెఎం నేతలు దర్శన్ పాల్, బల్బీర్ సింగ్ రాజేవాలా, మేజర్ సింగ్ పునివాలా తదితరులు పాల్గొన్నారు.
చారిత్రాత్మక రైతు ఉద్యమానికి 8 నెలలు
దేశ రాజధాని సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు చేస్తున్న చారిత్రాత్మక, అపూర్వమైన ఉద్యమం జులై 26 నాటికి సరిగ్గా ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది. ఈ ఉద్యమం రైతుల గౌరవం, ఐక్యతకు చిహ్నంగా మారిందని ఎస్కెఎం నేతలు తెలిపారు. ఇది ఇకపై రైతుల ఉద్యమం మాత్రమే కాదని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, దేశాన్ని కాపాడటానికి చేసే పోరాటాన్ని సూచించే ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు. తమ డిమాండ్లను మోడీ ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వందలాది వాహనాలు ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్నాయి. పంజాబ్లో108 ప్రాంతాల్లో మహిళా రైతుల నాయకత్వంలో కార్యక్రమాలు జరిగాయి. హర్యానాలోని భివానీ, హిసార్లో రాష్ట్ర మంత్రులు రైతుల నుంచి నిరసనను ఎదుర్కొన్నారు. రైతులు నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. కర్నాల్లో బిజెపి సమావేశాన్ని నల్ల జెండాలతో రైతులు వ్యతిరేకించారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో కూడా బిజెపి నాయకుడు సురీందర్ సింగ్ను నిరసనకారులు ఘెరావ్ చేశారు.
మిషన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ను ప్రారంభించిన ఎస్కెఎం
మిషన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ను సంయుక్త కిసాన్ మోర్చా ప్రారంభించింది. సెప్టెంబర్ 5న ముజఫర్ నగర్లో భారీ ర్యాలీతో మిషన్ లాంఛనంగా ప్రారంభమవుతుందని ప్రకటించింది. సోమవారం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మిషన్ ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ను ఎస్కెఎం నేతలు రాకేష్ తికాయిత్, యోగేంద్ర యాదవ్ తదితరులు ప్రకటించారు. రైతుల ఉద్యమం పంజాబ్, హర్యానాలో జరిగిన విధంగా బలోపేతం చేయడానికి రెండు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ మిషన్లో రైతు వ్యతిరేక బిజెపి, దాని మిత్ర పక్షాలకు ప్రతిచోటా ప్రతిఘటన ఎదురవుతుందని, ఆ పార్టీ నేతలను బహిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
తాజా వార్తలు