చరిత్రకు ఆనవాలు.. చెదలు పట్టింది నేడు!
‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అంటూ దాశరథి కృష్ణమాచార్యులు జన్మభూమి కీర్తిని ఎలుగెత్తి చాటారు. నిజాం నిరంకుశ పాలనపై తన కవితలతో ‘అగ్నిధార’ కురిపించారు. ఆయనతో పాటు మరో 150 మందిని నిజాం పాలకులు నిజామాబాద్ జైలులో బంధించారు. మూడు నెలల పాటు ఇక్కడే ఉన్నారు. జైలులో ఉన్నప్పుడు పళ్లు తోముకోవడానికి ఇచ్చిన బొగ్గులతో గోడల మీద దాశరథి ఎన్నో కవితలు రాశారు. విప్లవాగ్నిని రగిలించారు. అంతటి ఘనచరిత్ర ఉన్న ఈ జైలు గదిని స్మారకకేంద్రంగా తీర్చిదిద్ది ఆయన చిత్రాలు, కవితలతో అలంకరించింది ప్రభుత్వం. కానీ నిర్వహణలేక ప్రస్తుతం ఇది కాస్తా పశువుల పాకలా తయారైంది. చెదలుపట్టి అందవిహీనంగా మారింది. దీన్ని పర్యాటక ప్రదేశంగా మారుస్తామన్న హామీలు కార్యరూపం దాల్చలేదు. చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న ఇలాంటి ప్రాంతాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈనెల 22న దాశరథి జయంతి. కనీసం ఆ సందర్భంగా అయినా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దితే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది!
- ఈనాడు, నిజామాబాద్
Tags :