Updated : 15/07/2021 10:16 IST
J&K: తూర్పు లద్దాఖ్లో ఘర్షణలు అవాస్తవం
గల్వాన్ తరహా ఘటన చోటు చేసుకోలేదు
పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నాం : భారత సైన్యం
దిల్లీ: గల్వాన్ లోయలో చైనా సైన్యంతో మళ్లీ ఘర్షణ చోటు చేసుకుందన్న వార్తలను బుధవారం భారత సైన్యం ఖండించింది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్త ఘటనలు జరగలేదని.. చైనా అతిక్రమణలకు పాల్పడలేదని స్పష్టంచేసింది. ఆ దేశ సైన్య కదలికలను, మోహరింపులను భారత్ అనుక్షణం సునిశితంగా గమనిస్తోందని పేర్కొంది. తూర్పు లద్దాఖ్లోని చాలా ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖను చైనా దళాలు దాటాయని, ఒక ప్రాంతంలో ఇరు సైన్యాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందంటూ వచ్చిన వార్తా కథనాన్ని సైన్యం కొట్టిపారేసింది. ‘‘ఈ ఏడాది ఫిబ్రవరిలో బలగాల ఉపసంహరణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇరువైపుల నుంచి ఎలాంటి అతిక్రమణలు జరగలేదు. ఆ కథనంలో పేర్కొన్నట్లు గల్వాన్ లోయలో గానీ.. ఇతర ప్రాంతాల్లో గానీ ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదు’’ అని ప్రకటనలో సైన్యం తెలిపింది. చైనాతో కుదిరిన ఒప్పందాలు ఉల్లంఘనకు గురయ్యాయని కథనంలో పేర్కొనడాన్ని తప్పుపట్టింది. ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవని, అవి తప్పుడు ఆరోపణలని పేర్కొంది. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు చర్చలను కొనసాగిస్తున్నాయని, ఎవరి ప్రాంతాల్లో వారు గస్తీ నిర్వహిస్తున్నారని తెలిపింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) కదలికలు, మోహరింపులను నిశితంగా గమనిస్తున్నట్లు భారత సైన్యం స్పష్టం చేసింది.
ఏకపక్షంగా సరిహద్దు మార్పును ఒప్పుకోం: జైశంకర్
సరిహద్దు వద్ద యథాతథ పరిస్థితిని ఏకపక్షంగా మార్చడం అంగీకారయోగ్యం కాబోదని చైనాకు భారత్ స్పష్టం చేసింది. తజికిస్థాన్ రాజధాని దుషాన్బేలో బుధవారం జరిగిన షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భేటీ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయ్శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గంట సేపు చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న పరిస్థితిపై సంప్రదింపులు జరిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి సరిహద్దుల వద్ద శాంతి నెలకొనడం ముఖ్యమని జయ్శంకర్ చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే సంబంధాలు దెబ్బతింటాయని తెలిపారు. ఇంతవరకు కుదిరిన ఒప్పందాల ప్రకారమే సమస్యను పరిష్కరించాలని చెప్పారు. ఈ విషయమై త్వరగా సీనియర్ మిలటరీ కమాండర్ల సమావేశం నిర్వహించాలని ఇరువురూ నిర్ణయించారు. ఉభయ పక్షాలూ హద్దులు దాటకూడదని అంగీకరించారు.
భారత్ను బలహీనపరుస్తున్నారు: రాహుల్గాంధీ
నిరుడు గల్వాన్లోయలో జరిగిన ఘర్షణ తరహాలో తూర్పు లద్దాఖ్లో భారత్-చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందంటూ అంతకుముందు ఓ వార్తా కథనాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం.. భారత్ను బలహీన పరుస్తోందని ఆయన మండిపడ్డారు ‘‘దేశ విదేశీ, రక్షణ విధానాలను భారత ప్రభుత్వం రాజకీయ సాధనాలుగా వాడుకోవడం వలన దేశం బలహీనపడింది. ఇదివరకెన్నడూ భారత్ ఇంత దుర్బలంగా లేదు’’ అని రాహుల్ పేర్కొన్నారు.
Tags :