ఏడు పదుల సాహసికుడు బ్రాన్సన్
వాషింగ్టన్: ఏడు పదుల వయసుకు చేరిన వారు సాధారణంగా ఏం చేస్తారు. వీలైనంత ప్రశాంత జీవితాన్ని కోరుకుంటారు. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. సాహసాలు చేయాలన్నా, ప్రపంచ రికార్డుల్ని తిరగరాయాలన్న ఆయనకు అమితమైన ఆసక్తి. హాట్ ఎయిర్ బెలూనింగ్, బోటింగ్లలో బ్రాన్సన్ ప్రపంచ రికార్డులు సృష్టించారు. మరో వారం రోజుల్లో 71వ పుట్టిన రోజు చేసుకోనున్న ఆయన ఆదివారం ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లివచ్చి సరికొత్త రికార్డు సృష్టించారు. వాణిజ్య విమానయానం నుంచి ఫిట్నెస్ కేంద్రాల వరకూ అనేక అంశాలపై బాన్సన్కు మక్కువ. ‘‘చిన్నతనంలో రోదసిలోకి వెళ్లాలన్న కోరిక నాకు బలంగా ఉండేది. మా తరంలో అది సాధ్యం కాలేదు. ఎక్కువ మందికి ఆ అవకాశం కల్పించేందుకు వర్జిన్ గెలాక్టిక్ను స్థాపించా’’ అని ఈ యాత్రకు ముందు ఆయన పేర్కొన్నారు. 2007లో వర్జిన్ గెలాక్టిక్ రాకెట్ మోటార్ విఫలమవడంతో ముగ్గురు ఉద్యోగులు మరణించారు. 2014లో వ్యోమనౌకకు ప్రమాదం వాటిల్లి ఒక పైలట్ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీరి అంతరిక్ష కార్యక్రమంలో తీవ్ర జాప్యం జరిగింది. ఆ ఇబ్బందులను అధిగమించి తాజా యాత్రకు యాత్రకు వర్జిన్ గెలాక్టిక్ సంస్థ సిద్ధమైంది.
నాలుగోసారి..
వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక 2018లో తొలిసారి ప్రయోగాత్మకంగా రోదసిలోకి వెళ్లింది. 2019, ఈ ఏడాది మే నెలలో యాత్రలు చేసి వచ్చింది. అయితే కనీస స్థాయి సిబ్బందితోనే అవి జరిగాయి. తాజాగా నాలుగో పర్యటనలో మాత్రం పూర్తిస్థాయి సామర్థ్యం (ఆరుగురు వ్యోమగాములు)తో రోదసిలోకి వెళ్లి వచ్చింది. అంతరిక్షంలోకి పర్యాటకులను తీసుకెళ్లడానికి అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గత నెలలో ఈ సంస్థకు అనుమతి ఇచ్చింది. మానవరహిత యాత్రలతో కలిపి యూనిటీ-22కు ఇది 22వ యాత్ర.
వర్జిన్× ఆరిజిన్
లండన్లో జన్మించిన బ్రాన్సన్.. మరో వారంలో తన 71వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ యాత్రలో పాలుపంచుకోవాలని మొదట ఆయన భావించలేదు. మరో ప్రైవేటు రోదసి సంస్థ బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ తన రోదసి యాత్రను ప్రకటించాక బ్రాన్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అపోలో చంద్రుడిపై దిగి 52 వసంతాలు పూర్తికానున్న తరుణాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న తన యాత్రను చేపట్టనున్నట్లు బెజోస్ ప్రకటించారు. దీంతో ఆయనకన్నా ముందే రోదసిలోకి వెళ్లాలని బ్రాన్సన్ నిర్ణయించారు. ఈ మేరకు 9 రోజుల ముందే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేశారు. తమ వ్యోమనౌకలో ప్రయాణించేందుకు టికెట్లు కొనుగోలు చేసినవారిలో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. సొంత సంస్థ నిర్మించిన వ్యోమనౌకలో తొలిసారి రోదసియాత్ర చేసిన వ్యక్తిగా రిచర్డ్ చరిత్ర సృష్టించారు. మరోవైపు ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ఎక్స్ సంస్థ తన ‘స్టార్షిప్’ ప్రాజెక్టు ద్వారా అంగారకుడిపైకి మానవులను పంపాలనుకుంటోంది. రోదసి యాత్రల విషయంలో బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ఎక్స్ సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంది. యాత్ర ప్రారంభానికి ముందు బ్రాన్సన్, ఆయన బృందానికి బెజోస్ శుభాకాంక్షలు చెప్పారు.
Tags :